త్వరలో భారత మార్కెట్లోకి కోహియర్
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:50 AM
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్ ఇంటలిజెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కోహియర్ హెల్త్..భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్ ఇంటలిజెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కోహియర్ హెల్త్..భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం నాడిక్కడ కంపెనీ కో ఫౌండర్, గ్లోబల్ సీఈఓ శివ నమశివాయం మాట్లాడుతూ.. అమెరికాలో అగ్రశ్రేణి ఐదు బీమా కంపెనీలతో కలిసి హెల్త్కేర్ రంగానికి అవసరమైన సేవలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా రానున్న సంవత్సరాల్లో భారత్తో పాటు పశ్చిమాసియా దేశాల మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు శివ వెల్లడించారు. ఇందుకోసం ఇక్కడి బీమా సంస్థలు, హాస్పిటల్స్తో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు చెప్పారు. క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సహా వివిధ రకాల సేవలను కోహియర్ ద్వారా అందించనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది హైదరాబాద్ కేంద్రంగా ఏఐ ఆధారిత క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సేవలందిస్తున్న జిగ్నా ఏఐను కోహియర్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను 50 మంది ఉద్యోగులతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 200కు చేరిందని, సంవత్సరాంతం నాటికి మరో 40 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సెంటర్లో అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన ప్రొడక్ట్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!