పుర్రె ఎముక తెరవకుండానే సర్జరీ
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:42 AM
పుర్రె ఎముక తెరవకుండానే.. వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- యువతికి అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స
హైదరాబాద్ సిటీ: పుర్రె ఎముక తెరవకుండా మెదడులోని క్యాన్సర్ కణతిని అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. మహబూబాబాద్(Mahabubabad)కు చెందిన భూక్య రోజా (31) కొన్ని నెలలుగా చూపు క్రమంగా తగ్గిపోవడం, తీవ్రమైన తలనొప్పి, హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి సమస్యలతో బాధపడుతూ వైద్యులను ఆశ్రయించారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్లలో ఆమెకు సైనోనాసల్ కాండ్రోసార్కోమా అనే అరుదైన స్కల్బేస్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్యాన్సర్ కణితి చూపు నరాలు, పిట్యూటరీ గ్రంథి, ముఖ్యమైన రక్తనాళాలకు అతి సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స ప్రమాదకరంగా మారింది.

సాధారణంగా ఇలాంటి కేసుల్లో తల ఎముక తెరవాల్సి వస్తుంది. కానీ కేర్ ఆస్పత్రి వైద్యులు ఎండోస్కోపిక్ ఎండోనాసల్ స్కల్బేస్ పద్ధతిని ఎంచుకుని, ముక్కు మార్గం ద్వారా కణితిని చేరుకుని తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత రోజా సాధారణంగా నడవగలుగుతూ, చూపుతో రోజువారీ పనులు చేసుకుంటున్నారని సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ స్కల్బేస్ సర్జరీ నిపుణుడు కె. వంశీ కృష్ణ తెలిపారు. సైనోనాసల్ కాండ్రోసార్కోమా తల మెడ క్యాన్సర్లలో 0.1 శాతం కన్నా తక్కువగా కనిపించే అత్యంత అరుదైన వ్యాధి అని చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిలేశ్ గుప్తా అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News