జలుబు దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తినడం మంచిదేనా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:31 PM
దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు అరటిపండ్లు తినకూడదని అంటారు. ఇలా ఎందుకు అంటారు? జలుబు దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తినడం మంచిది కాదా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అరటిపండ్లు పోషకాల పవర్ హౌస్. ఇవి పొటాషియం, ఫైబర్, విటమిన్ B6, C సమృద్ధిగా కలిగి ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ తక్షణ శక్తిని అందిస్తాయి. రోజుకు ఒకటి-రెండు అరటిపండ్లు తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుందని, మలబద్ధకం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దగ్గు లేదా జలుబు ఉంటే, వీటిని తినకూడదని చాలా మంది సలహా ఇస్తారు. అరటిపండ్లు జలుబు చేస్తాయని, శరీరంలో శ్లేష్మాన్ని పెంచుతాయని చెబుతారు. అయితే, ఇందులో నిజమెంత? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అరటిపండ్లు తినడం వల్ల జలుబు ఎక్కువ అవుతుందని వైద్య శాస్త్రంలో ఎలాంటి ఆధారాలూ లేవు. దగ్గు లేదా కఫ సమస్య ఉన్నవారికి అరటిపండ్లు తింటే కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ అరటిపండ్లు దగ్గు లేదా జలుబును నేరుగా ఎక్కువ ప్రభావితం చేయవు.
ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు కఫాన్ని పెంచే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే శీతాకాలంలో లేదా జలుబు సమస్య ఉన్నప్పుడు అరటిపండ్లు తినకూడదని సూచిస్తారు. జలుబు స్వభావం ఎక్కువగా ఉన్నవారు అరటిపండ్లు తింటే సమస్య మరింత పెరగవచ్చు. కానీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు అరటిపండ్లు తింటే దగ్గు లేదా జలుబు వస్తుందని చెప్పడం నిజం కాదు. అయితే కఫం లేదా గొంతు సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినడంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
దగ్గు, జలుబు లేదా కఫం ఉన్నప్పుడు అరటిపండ్లు తినకపోవడం మంచిది. అరటిపండులోని గుణం వల్ల శరీరంలో కఫం పెరిగి గొంతు నొప్పి, దగ్గు తీవ్రత పెరగవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట లేదా చల్లని వాతావరణంలో వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News