గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:34 AM
పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. 2026 ఎస్ఎస్సీ పరీక్షలను విద్యా శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 13 వరకూ జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం తెలంగాణ వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ఠ ఏర్పాట్లతో పరీక్షలను నిర్వహించారు. మరోవైపు ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 16 వరకూ జరగనున్నాయి.
పది ఫలితాలు ఎప్పుడంటే..
అయితే, పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా?, ఎప్పుడు కాలేజీలకు వెళ్తామా? అని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షా ఫలితాలను వెల్లడించేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. 2026 మే మొదటి వారంలో రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం ఏప్రిల్ 16 లేదా అంతకంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, సాంఘిక శాస్త్రం మూల్యాంకనం ఏప్రిల్ 17 నుంచి 23 తేదీల మధ్య జరగనుంది. ఏప్రిల్ చివరి నాటికి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తి కానుంది. ఈ మేరకు మే మెుదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..