Hyderabad: కత్తితో పొడిచి.. బండరాయితో మోది..
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:35 AM
కత్తితో పొడిచి.. బండరాయితో మోది.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నగరంలోని కార్ఖానాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- మహిళ దారుణ హత్య
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆమెతో అతడికి చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ మధ్య ఆమెకు కొత్త వారితో స్నేహాలు ఏర్పడ్డాయి. దీంతో తనను విస్మరిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కార్ఖానాకు చెందిన మహిళ(30) 2012లో ప్రేమ పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. ఆమె ఓ బార్లో పని చేస్తోంది. అదే బార్లో పనిచేసే జహీరుద్దీన్తో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. ఫాతిమా(Fatima)కు ఇటీవల కొత్త స్నేహాలు ఏర్పడడంతో తనను విస్మరిస్తోందని జహీరుద్దీన్ అనుమానం పెంచుకున్నాడు. ఫోన్ చేసినా ఫాతిమా మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేక ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం(11వ తేదీ) రాత్రి ఫాతిమా బార్లో విధులు ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ ద్విచక్ర వాహనంతో ఉన్న జహీరుద్దీన్ తనతో ఎందుకు మాట్లాడం లేదని నిలదీశాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమెను సముదాయించి వాహనంపై ఎక్కించుకొని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఫాతిమాతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. ఆమె కింద పడిపోగా అక్కడే ఉన్న బండరాయి తీసుకొని తల మీద బాదాడు.

దీంతో ఫాతిమా అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం జహీరుద్దీన్ బోరబండ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్లో నో ఆర్ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్రన్ సక్సెస్
Read Latest Telangana News and National News