Hyderabad: నకిలీ ఆధార్.. డ్రగ్స్ స్మగ్లింగ్...
ABN , Publish Date - Jan 10 , 2026 | 09:22 AM
నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకొని స్థానికుల మాదిరిగా హైదరాబాద్లో ఉండూ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్..
- రూ.20లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం
హైదరాబాద్ సిటీ: వీసా గడువు ముగిసినా ఢిల్లీ(Delhi)లో ఉంటూ.. బ్రోకర్ల సహకారంతో నకిలీ ఆధార్ పొంది భారతీయుడిగా చెలామణి అవుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అలాంటి ఇద్దరు నైజీరియన్(Nigerian) స్మగ్లర్స్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ), టోలీచౌకి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్న్యూ ఇన్స్పెక్టర్ డానియెల్ టీమ్తో కలిసి డీసీపీ వైభవ్ గైక్వాడ్ శుక్రవారం బషీర్బాగ్లోని సీసీఎస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

అక్రమంగా డిల్లీలో ఉంటూ..
నైజీరియాకు చెందిన చిడీ ఇజెహ్ అలియాస్ నాగేశ్వరన్ 2014లో మెడికల్ అటెండెన్స్ వీసాతో ఇండియాకు వచ్చాడు. ఢిల్లీలో ఉన్న నైజీరియన్స్తో పరిచయం పెంచుకుని డ్రగ్స్ స్మగ్లర్గా మారాడు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని కస్టమర్స్, పెడ్లర్లకు ఎండీఎంఏ, కైకైన్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో గోల్కొండ, 2024లో అమీర్పేట ఎక్సైజ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయాడు. వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా అక్రమంగా అక్కడే ఉంటూ బ్రోకర్స్ సహకారంతో నాగేశ్వరన్ పేరుతో నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. నైజీరియాకు చెందిన స్మగ్లర్స్ ఆదేశాలతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు.

- మరో స్మగ్లర్ ఓబాసీ జేమ్స్ విక్టర్ 2011లో టూరిస్టు వీసాపై భారత్కు వచ్చి ముంబైలో దిగాడు. ఆ తర్వాత క్లాత్ ఎక్స్పోర్టు బిజినెస్ ప్రారంభించాడు. అందులో నష్టాలు రావడంతో ఢిల్లీకి మకాం మార్చాడు. అక్కడ ‘విలియం ఆఫ్రికన్’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఢిల్లీలోనే మ్యారేజ్ చేసుకున్న జేమ్స్ ఫ్యామిలీతో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అదే ఇంట్లో చిడీ ఇజెహ్ అలియాస్ నాగేశ్వరన్ అద్దెకు ఉంటుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రెస్టారెంట్లో పెద్దగా ఆదాయం రాకపోవడంతో చిడీ ఇజె్హతో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు.
ఒక్కోసారి చిడ్దీతో పాటు బెంగళూరు, హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో గురువారం నగరంలోని పెడ్లర్స్, కస్టమర్స్కు డ్రగ్స్ సరఫరా చేయడానికి సిటీకి వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న హెచ్ న్యూ, టోలీచౌకి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఎఫ్ఆర్ఆర్వో సకారంతో వారిని త్వరలోనే ఇండియా నుంచి నైజీరియాకు డిపోర్టేషన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్
Read Latest Telangana News and National News