కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:08 PM
పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుప్పకూలాయి.
ఆంధ్రజ్యోతి, జులై 8: పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యక్తమైన ఆందోళనల సెగ బుధవారం నాటి ట్రేడింగ్లో భారత సూచీలను భారీ నష్టాల్లోకి నెట్టింది. ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై మరింతగా కుప్పకూలాయి.
మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా 1,677.12 పాయింట్లు (2.15%) పతనమై 76,503.60 వద్ద స్థిరపడింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ-50 (Nifty) సైతం 516.65 పాయింట్లు (2.12%) నష్టపోయి 23,882.05 వద్ద ముగిసింది.
మధ్యాహ్నం 1 గంట తర్వాతే అసలు పతనం
ఉదయం సెన్సెక్స్ 77,816.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,259.55 పాయింట్ల వద్ద లాభనష్టాల మధ్య సాధారణంగానే ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 77,851.18 వద్ద, నిఫ్టీ 24,300.00 వద్ద ఈరోజు గరిష్ఠాలను తాకాయి. అయితే మధ్యాహ్నం 1:00 గంట దాటిన తర్వాత పశ్చిమాసియా నుంచి వచ్చిన ప్రతికూల వార్తలతో మార్కెట్లు నిలువునా కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఒకానొక దశలో 76,259.03 పాయింట్ల కనిష్టానికి, నిఫ్టీ 23,805.20 పాయింట్ల కనిష్టానికి పడిపోయి ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించాయి.
మార్కెట్ల కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణాలు:
ముదురుతున్న యుద్ధ భయాలు: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం ప్రపంచవ్యాప్త మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
ముడిచమురు సెగ: ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇది భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమైంది.
పెద్ద ఎత్తున అమ్మకాలు: మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా షేర్లను విక్రయించి నగదును సురక్షితమైన బంగారం వైపు మళ్లించేందుకు మొగ్గు చూపారు.
ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ఈ రోజు ముగిసిన ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, మెటల్, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లు ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడంతో ఇన్వెస్టర్ల దాదాపు 8.4 లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 2% పైగా పడిపోవడంతో రూ. 8.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఇండియా విక్స్ 25% పెరిగిపోయింది.
ఒకే సెషన్లో పెట్టుబడిదారుల సంపద సుమారు రూ. 8.40 లక్షల కోట్లు క్షీణించింది. గత సెషన్లోని రూ. 480.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈ సెషన్లో రూ. 471.80 లక్షల కోట్లకు పడిపోయింది. ఫలితంగా సెషన్ సమయంలో అస్థిరత తీవ్రంగా పెరిగింది. ఇండియా విక్స్ (VIX) 24.86 శాతం పెరిగి 14.54కు చేరింది. ఇది పెట్టుబడిదారులలో పెరిగిన ఆందోళనను సూచిస్తోంది.
ఇవాళ మార్కెట్ అంతటా కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్ఎస్ఈలో 2,525 స్టాక్లు క్షీణించగా, 694 పురోగమించాయి. 86 స్టాక్లు యథాతథంగా ఉన్నాయి.
దీంతో, అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 2.72 శాతం, నిఫ్టీ కెమికల్స్ 2.67 శాతం, నిఫ్టీ సిమెంట్ 2.57 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.52 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.51 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.49 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.45 శాతం, నిఫ్టీ మీడియా 2.31 శాతం, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ ఒక్కొక్కటి 2.23 శాతం చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాక్లలో, ఇండిగో 5 శాతం పడిపోయింది. దాని తర్వాత మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ & టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్టెల్ ఉన్నాయి. అయితే, సెన్సెక్స్లో ట్రెంట్ అతి తక్కువగా ప్రభావితమైన స్టాక్గా నిలవడం విశేషం. ఇది 0.20 శాతం స్వల్పంగా తగ్గింది.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..