ప్రియుడితో కలిసి తల్లి హత్య
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:39 AM
ప్రియుడితో కలిసి సొంత కూతురే తల్లిని దారుణంగా హతమార్చిన సంఘటన ఇది. తన తొమ్మిదేళ్ల కొడుకు చూస్తుండగానే శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
కాళ్లూ చేతులు కట్టేసి కుమార్తె దారుణం...నిందితులు పరార్.. పొన్నూరులో ఘటన
పొన్నూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రియుడితో కలిసి సొంత కూతురే తల్లిని దారుణంగా హతమార్చిన సంఘటన ఇది. తన తొమ్మిదేళ్ల కొడుకు చూస్తుండగానే శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (45) లక్ష్మికి కుమార్తె పుష్పలత, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆమె పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కుమార్తె పుష్పలత.. వివాహమైనప్పటికీ భర్తతో దూరంగా ఉంటోంది. విజయవాడకు చెందిన రాజా అనే యువకుడితో రెండు నెలలుగా తల్లి వద్దే ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం వేకువజామున ఇంట్లో తల్లి లక్ష్మి.. కాళ్లూ చేతులు కట్టివేసిన స్థితిలో మరణించి ఉన్నట్లు స్థానికులు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మిని కుమార్తె పుష్పలత తమె ప్రియుడు రాజాతో కలిసి కాళ్లూచేతులు కట్టేసి గొంతు నులిమి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.
ఇరువురూ రాత్రి నుంచి పరారీలో ఉండటం పోలీసుల అనుమానాలను బలపరుస్తోంది. అంతేకాకుండా, పుష్పలత 9 ఏళ్ల కుమారుడు సైతం.. తన అమ్మమ్మ లక్ష్మిని తల్లి పుష్పలత, రాజా కలిసి కాళ్లూ చేతులు కట్టేశారని స్థానికులకు, పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశోధన చేసింది. లక్ష్మికి చెందిన బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగి ఉంటుందని, లేదా కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి