Share News

అశోక్ గజపతిరాజు స్థలం తిరిగి అప్పగించాలి.. అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 03:41 PM

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వివాదంపై మంత్రి కొండపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అశోక్ గజపతిరాజు స్థలం తిరిగి అప్పగించాలి.. అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు
Minister Kondapalli

విజయనగరం: మాజీ కేంద్ర మంత్రి, గోవా గవర్నర్‌ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలాన్ని తిరిగి ఆయనకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొండపల్లి ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించడం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు.


అశోక్ గజపతిరాజు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్న మంత్రి, గత ప్రభుత్వంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, ఆయనకు చెందిన స్థలాన్ని కూడా కబ్జా చేసి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసపాటి వంశీయుల ఆస్తులపై ఆ సంస్థానాధీశులకే పూర్తి హక్కులు ఉంటాయని, ఈ విషయం వైసీపీ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు.


రికార్డుల ప్రకారం సర్వే నంబర్లతో సహా అశోక్ గజపతిరాజు సమర్పించిన వివరాలను పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఖాళీగా ఉన్న స్థలమని రికార్డులు తారుమారు చేసినా, అలాంటి భూమిని ప్రభుత్వ పరిరక్షణలో ఉంచాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా అప్పగించారని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ పాలనలో పేదల భూములను కూడా పలువురు నాయకులు కబ్జా చేశారని, ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు.


Also Read:

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా..

Updated Date - Jun 30 , 2026 | 03:54 PM