విశాఖలో సందడిగా సండేస్ ఆన్ సైకిల్.. ఆర్కే బీచ్లో బ్రిక్స్ దేశాల మంత్రుల సైక్లింగ్..
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:04 AM
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయం ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం సందడిగా సాగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు.
విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్లో ఇవాళ (ఆదివారం) ఉదయం ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం సందడిగా సాగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. వారితో పాటు నగరవాసులు భారీ సంఖ్యలో సైకిళ్లపై బీచ్కు చేరుకుని కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఆర్కే బీచ్లో క్రీడా శాఖ మంత్రులతో కలిసి సైక్లింగ్ చేసినట్లు తెలిపారు. ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1,800 నగరాల్లో మిలియన్ల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకూ దోహదపడుతుందన్నారు. ప్రజలు నిత్య జీవితంలో సైక్లింగ్ను భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
కాగా, ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీ క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. బీచ్ రోడ్డుపై మంత్రులు, అధికారులు, ప్రజలు కలిసి సైక్లింగ్ చేయడంతో సందడి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏఈ నూకరాజు కేసు.. కేరళ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు సాధిక్ ప్లాన్?