ఘనంగా 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ.. స్పీకర్ ఎమోషనల్ స్పీచ్..
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:54 PM
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై వెలువడిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు.
విశాఖపట్నం: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై వెలువడిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు. వెంకయ్య నాయుడు గురించి మాట్లాడటం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టేనని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఇక్కడే చదువుకున్నారని గుర్తుచేసిన స్పీకర్.. ఆయన గురించి మాట్లాడటం తనలాంటి వారికి సాహసమేనని చెప్పుకొచ్చారు.
వెంకయ్య నాయుడు ముందు తామంతా చిన్నవాళ్లమేనని, జై ఆంధ్ర ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చినప్పుడు తానూ పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడితే యువతలో ఉత్తేజం నిండుతుందని.. అసెంబ్లీలో ఆయన ప్రసంగాలను ఎంతో ఆసక్తిగా వినేవాడినని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నాయకుడు వెంకయ్య నాయుడేనని ఈ సందర్భంగా స్పీకర్ కొనియాడారు. డబ్బున్నవారికి కాదు.. నిజంగా అవసరమైన పేదలకు మాత్రమే పెన్షన్లు అందాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారని తెలిపారు. వెంకయ్య నాయుడు వ్యక్తిత్వానికి తామంతా దాసోహమని.. ఆయన ఎంతో క్లాసికల్గా మాట్లాడతారని, తాను మాత్రం ఆ స్థాయిలో మాట్లాడలేనని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించని వారికి సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉండదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయడం కంటే, ప్రజలే స్వయంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు లిస్టులో పేరు లేని వ్యక్తులకు పెన్షన్లు అందవని.. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. అలాగే సోషల్ మీడియా కారణంగా అసత్య ప్రచారం పెరిగిందని, లేనిపోని విషయాలను కల్పించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ వెంకయ్య నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్