హనీట్రాప్ కలకలం: మాజీ సర్పంచ్ను నిలువునా ముంచేసిన కిలాడి లేడి
ABN , Publish Date - Jul 02 , 2026 | 08:42 PM
తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 'కిలాడి లేడి' ఉషారాణి హనీట్రాప్ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి, జులై 2: జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 'కిలాడి లేడి' ఉషారాణి హనీట్రాప్ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. పెళ్లి పేరుతో అమాయకులను, ప్రముఖులను ట్రాప్ చేసి, ఆపై బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతూ కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఈ ముఠా వలలో చిక్కి తాను సర్వస్వం కోల్పోయానని వడమాలపేట మండలం పాదిరేడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చుక్క చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. ఉషారాణి తనను టార్గెట్ చేసి, నిలువునా ముంచేసిందని కన్నీటిపర్యంతం అయ్యారు.
బాధితుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఉషారాణి మొదట పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం హనీట్రాప్ ముఠా రంగంలోకి దిగారు. నన్ను బెదిరిస్తూ అకౌంట్ల ద్వారా ఏకంగా రూ. 90 లక్షల నగదును బదిలీ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా నాకు సంబంధించిన 3 ఎకరాల విలువైన భూమిని బలవంతంగా తన పేరిట రాయించుకుంది. భవిష్యత్తులో ఇంకా వేధించడానికి వీలుగా ఖాళీ బాండ్లు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకుంది. దీని వెనుక కేవలం ఉషారాణి మాత్రమే కాకుండా, పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన ఒక ఉన్నతాధికారి హస్తం కూడా ఉంది. ఆ అధికారి అండదండలతోనే ఈ ముఠా ఇంతలా రెచ్చిపోతూ బ్లాక్మెయిలింగ్ దందాను నడిపిస్తోంది. నాకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..
మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..