మాతాశిశువుకు భరోసా.. నేడు ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ ప్రారంభం..
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:45 AM
ఏపీలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
అమరావతి, నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం తెలిపారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణను మెరుగుపర్చడం, ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువుకు ఎదురయ్యే రవాణా సమస్యలను తొలగించడం, అత్యవసర సమయాల్లో, హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సేవలు పూర్తిగా ఉచితం. అవసరమైన వారు 102 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఈ సేవలు పొందవచ్చు.
ఈ పథకం కోసం రాష్ట్రంలో నూతనంగా 500 వాహనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా 300 వాహనాలను మంగళవారం ప్రారంభించనుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ వాహనాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తారు. వీటిని నరసరావుపేటలోని పోలీసు మైదానానికి తరలించారు. ఈ వాహనాల ద్వారా ఏటా 2.75 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఈ వాహనంలో ఏసీతోపాటు పూర్తిస్థాయి రక్షణ, భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్లు, వంటివి అమర్చారు. ప్రసవానంతరం తల్లీబిడ్డతోపాటు వారి సహాయకులను ఈ వాహనం ద్వారా వారి ఇళ్లకు చేరుస్తారు.
ఇవి కూడా చదవండి
నిమ్స్లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు