మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తన.. చర్యలు తప్పవు: రాయపాటి శైలజ
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:36 PM
శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగిన దురుసు ప్రవర్తన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారిపై అనుచితంగా వ్యవహరించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
అమరావతి, జులై 30: శ్రీకాకుళం జిల్లాలో మహిళా సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)పై జరిగిన దురుసు ప్రవర్తన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించినట్లు కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారిని అవమానించడం లేదా బెదిరించడం సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో మాట్లాడనున్నట్లు వెల్లడించారు. మహిళల గౌరవాన్ని కాపాడటం, విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ..‘చట్టాన్ని అమలు చేసే అధికారుల పట్ల రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదులు, వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటాం. మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తన లేదా ఒత్తిళ్లను రాష్ట్ర మహిళా కమిషన్ ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
మరణానికి చేరువలో తండ్రి.. కొడుకుకి జీవిత పాఠాలు.. వీడియో వైరల్
For More TG News And Telugu News