నేపాల్ జల విలయంలో తెలుగు ప్రవాసులు
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:21 AM
నేపాల్ జల విలయంలో గల్లంతైన, ఇరుక్కుపోయిన వారిలో కొందరు తెలుగు ప్రవాసులు కూడా ఉన్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దులో వీరి సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి) : నేపాల్ జల విలయంలో గల్లంతైన, ఇరుక్కుపోయిన వారిలో కొందరు తెలుగు ప్రవాసులు కూడా ఉన్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దులో వీరి సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖతార్లో పనిచేసే సి.రమేశ్ బాబు ప్రమాదానికి కొన్ని గంటల ముందు చైనా-నేపాల్ సరిహద్దులోని రసువాలో చైనా వైపు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద కనిపించారు. ఆ తర్వాత ఆయన జాడ తెలియకపోవడంతో ఖతార్లోని బంధుమిత్రులతో పాటు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కుటుంబం ఆందోళన చెందుతోంది.
దుబాయ్లో నివాసం ఉండే మూడు తెలుగు కుటుంబాలకు చెందిన ఐదుగురు ప్రవాసులు కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరిగొస్తుండగా వరద కారణంగా గత మూడు రోజులుగా చైనా భూభాగం వైపే ఆగిపోయారు. తాము చేరుకునే సమయానికి రుసువా చెక్ పోస్ట్ వరదల్లో కొట్టుకుపోయిందని ఈ బృందంలోని గుంటూరు జిల్లాకు చెందిన సౌజన్య రెడ్డి దుబాయ్లోని తన బంధువులకు సమాచారమందించారు. అయితే శుక్రవారం వారు టిబెట్ నుంచి సురక్షితంగా నేపాల్కు చేరుకున్నట్లు తెలిసింది. ఇక ఏపీకి చెందిన మొత్తం 10 మంది ప్రవాసుల ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. వీరిలో అమెరికాలో స్థిరపడ్డ వారు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన మొత్తం 23 మంది ప్రవాసులు యాత్రకు వెళ్లగా.. అందులో అత్యధికులు అమెరికాకు చెందిన వారే ఉన్నారు. దుబాయ్లోని రెండు తెలంగాణ కుటుంబాలు కూడా యాత్రకు వెళ్లగా వారు క్షేమంగానే ఉన్నట్లుగా తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు