ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:05 PM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఐదు గంటలపాటు సమావేశమై వారి ప్రధాన డిమాండ్లను సమగ్రంగా విన్నామని చెప్పారు.
అమరావతి, జులై 22: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఐదు గంటలపాటు సమావేశమై వారి ప్రధాన డిమాండ్లను సమగ్రంగా విన్నామని చెప్పారు. మొత్తం 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను మంత్రి వర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని పూర్తిగా విన్నామని.. వాటన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ముఖ్యంగా వేతన సవరణ కమిషన్(పీఆర్సీ)ను వెంటనే ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించడం, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడం, ఉద్యోగులకు సంబంధించిన వివిధ బిల్లులను సకాలంలో చెల్లించడం వంటి ప్రధాన డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూనే ఉద్యోగుల సమస్యలకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదన్న పయ్యావుల.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరువర్గాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, అందుకే ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి, ఆర్థికంగా సాధ్యమైన మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News