Share News

విద్వేషాలు దేశానికి శ్రేయస్కరం కాదు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 03 , 2026 | 07:00 PM

తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగమని, ఎవరైనా అక్కడకు వెళ్లి.. ఆస్పత్రిలో చూపించుకోవచ్చు కదా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యటించిన ఆయన.. అక్కడి 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 విద్వేషాలు దేశానికి శ్రేయస్కరం కాదు: ఏపీ డిప్యూటీ సీఎం  పవన్  కల్యాణ్
Pawan Kalyan Telangana Andhra

అమరావతి, జూన్03: 'తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఎవరైనా అక్కడకు వెళ్ళవచ్చు, ఆస్పత్రిలో చూపించుకోవచ్చు. హద్దులకు ఫెన్సింగ్‌లు వేస్తారేమో కానీ, మనుషుల మనసులకు వేయలేరు కదా!' అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో పర్యటించిన ఆయన.. అక్కడి 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరని, కానీ తెలుగువారి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎప్పుడూ వేరే రాష్ట్రం వారు రాకూడదని చెప్పలేదని గుర్తుచేశారు.


తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు పనులు చేసుకుంటున్నప్పుడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకని పవన్ ప్రశ్నించారు. పుష్కర కాలం తర్వాత కూడా ఇంత ద్వేషం ఉంటుందని తాను అనుకోలేదన్నారు. 'హైదరాబాద్ నా ఇల్లు, నా పార్టీ అక్కడే ఆవిర్భవించింది. అక్కడికి వెళ్ళడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తెలంగాణలో పుట్టిన భూమి పుత్రులు సభలు పెట్టుకుంటే తప్పేంటి?'అని నిలదీశారు.


ఈ వివాదం చినికి చినికి గాలివాన అయిందే తప్ప దీని వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో తనకు సోదర సమాన బంధం ఉందని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలే పనిగట్టుకుని ఇలాంటి విద్వేషాలు రేపుతున్నారని పవన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోటీ చేయవచ్చు కానీ, తాము వస్తే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగినా ప్రయోజనం ఏముందని, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి మహనీయుల త్యాగాలను గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకడమే తన తపన అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?.. వైసీపీ తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజం

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

Updated Date - Jun 03 , 2026 | 07:40 PM