వైసీపీపై మంత్రి నారా లోకేశ్ ఫైర్.. టీడీపీ కేడర్కు కీలక సూచనలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:24 PM
టీడీపీ విజయనగరం నియోజకవర్గ కేడర్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ వైసీపీపై ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు..
విజయనగరం, ఆగస్టు 22: టీడీపీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ‘గొడ్డలి పార్టీ’ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణుల్లో చాలామందిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించిన లోకేశ్.. ఎక్కడెక్కడ అక్రమ కేసులు నమోదు చేశారో వాటన్నింటినీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని, అయితే టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
మూడు పర్యాయాల పాటు టీడీపీ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేడర్ సమావేశం అనంతరం 2023-24 సంవత్సరంలో ‘భవిష్యత్ గ్యారంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉత్తమ పనితీరు కనబరిచిన 100 మంది టీడీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ ప్రశంసాపత్రాలు అందజేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా కేడర్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్డే విషెస్
అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News