విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:23 PM
కాకినాడ జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్.. విద్య, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల భవిష్యత్పై ప్రసంగించారు. ‘భారతీయం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని, విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నారు.
కాకినాడ, సెప్టెంబర్ 20: జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్ ‘భారతీయం’ కార్యక్రమంలో పాల్గొని విద్యా వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య ద్వారా సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని పేర్కొన్న ఆయన.. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్య, ప్రభుత్వ పాఠశాలలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ఇష్టమని తెలిపారు.
ఇదే సందర్భంలో రంపచోడవరం బాలిక ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు.. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంత క్లిష్టంగా అనిపించినా వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయని, ఇబ్బందులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో మాట్లాడాలని చెప్పారు. పిల్లలు క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి జీవితాలను మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు జీవితాంతం కడుపుకోత మిగిల్చే పరిస్థితి తీసుకొస్తాయని లోకేశ్ అన్నారు. విద్యార్థుల్లో మానసిక ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా మంచి సమాజాన్ని నిర్మించే శక్తిగా మారాలని, అందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
Read Latest Telangana News And AP News And National News