కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:58 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఓ జాబ్మేళా కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత కష్టాన్ని నమ్ముకుని, స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ఓ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్మేళాలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని, భవిష్యత్తుపై స్పష్టత ఉండాలని సూచించారు. యువత స్వశక్తితో ఎదగాలన్న ఆమె.. కష్టాన్ని నమ్ముకోవాలని, తద్వారా ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని చెప్పారు.
'నాడు విజన్ 2020.. నేడు విజన్ 2047. ఈ లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే ఏం జరిగిందో గత ఐదేళ్లలో మనం చూశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారు. నేను ఏమి చేయగలనో అదే హామీ ఇస్తానని చంద్రబాబు నాతో ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు' అని భువనేశ్వరి పేర్కొన్నారు.
ఇక తాను గృహిణిగా ఉంటూనే హెరిటేజ్ బాధ్యతలను సవాల్గా స్వీకరించానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. 'జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతిదానికీ అసంతృప్తికి లోనుకాకూడదు. కష్టపడి పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. మంచి ప్రయోజకులు కావాలని, భవిష్యత్తు బావుండాలని తాపత్రయపడతారు. పిల్లలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నా కుమారుడు లోకేశ్ పెంపకం, చదువు బాధ్యతలు నేనే చూసుకున్నాను. ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పి పెంచాను' అని సీఎం సతీమణి తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
ఇవీ చదవండి:
పీఎన్జీ తిరస్కరిస్తే ఎల్పీజీ సరఫరా కట్: కేంద్రం
నాలుగేళ్ల చిన్నారితో ఇలాగేనా ప్రవర్తించేంది.. పోలీసులకు సుప్రీం చురకలు