అంబటి, జోగి లాంటి బ్యాచ్లు ఇంకా ఉన్నాయి: భూమా అఖిల ప్రియ
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:17 PM
వైసీపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని సీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరకు వెళ్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. సీమ రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.
కర్నూలు: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ రైతుల కడుపు కొట్టి తమ కడుపులు నింపుకొన్నారని మండిపడ్డారు. రైతులకు మేలు చేయాల్సిన పాలకులు.. స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ లాంటి నేతల బ్యాచ్ ఇంకా వైసీపీలో కొనసాగుతోందని అన్నారు. లోకేష్ అన్న ఒక్కసారి కనుసైగ చేస్తే.. వైసీపీ నేతలు మైకుల ముందు మాట్లాడలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని, ఆలోచనా విధానాన్ని మార్చుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టామని అఖిలప్రియ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అంబటి, జోగి లాంటి నేతలు తమ ఇష్టానుసారంగా మాట్లాడితే జగన్ వారిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. సీమ రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు.
వైసీపీ నేతల మాటలను వారి ఇళ్లలో ఉన్న భార్యలే వినరని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం అన్యాయమని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
రాజమండ్రిలో కలకలం.. స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..
Read Latest AP News And Telugu News