మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - May 27 , 2026 | 04:49 PM
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, భీమా పథకాలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందన్నారు.
జూన్ 5 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
అవగాహన కార్యక్రమాలు
జూన్ 8 నుంచి 14 వరకు కేంద్ర నిధులతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులను సందర్శిస్తామని, జూన్ 12 నుంచి 14 వరకు మీడియా సమావేశాల ద్వారా మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ కారిడార్లు, రైల్వే అభివృద్ధి పనుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.
దేశ జీడీపీ గణనీయంగా పెరిగిందని, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరుకుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారత్కు, ప్రధాని మోదీకి గౌరవం పెరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News