20 నెలల్లోనే 14 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:55 PM
ఏపీలో డయాలసిస్ కేంద్రాల పెంపుపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనమండలిలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య పెంపుపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 985 మిషన్లు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1,736 డయాలసిస్ మిషన్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,504 మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 14 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు.
గతంలో నెలకు సుమారు 40 వేల డయాలసిస్ సెషన్లు జరుగగా... ప్రస్తుతం 66 వేల సెషన్లకు పెరిగాయని మంత్రి తెలిపారు. 675 మంది పేషెంట్లకు నెలకు 10 వేల రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగులకు కూడా పింఛన్లు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. కిడ్నీ రోగుల చికిత్సపై సగటున 86 వేల రూపాయల చొప్పున గత 20 నెలల్లో మొత్తం 224 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News