Share News

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:09 PM

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని నీటిని డెల్టా అవసరాలకు వాడుతున్నారు.

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Krishna Delta Water Release

అమరావతి, జులై 1: కృష్ణా డెల్టాకు నీరు విడుదలైంది. ఈరోజు(బుధవారం) కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత గద్దె అనూరాధ, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని నీటిని డెల్టా అవసరాలకు వాడుతున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులో వరద వచ్చే వరకు పులిచింతల నీరే ఆధారంకానుంది.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాలో పుష్కలంగా రైతులు పంటలు పండించాలని ఆకాంక్షించారు. 3200 క్యూసెక్కుల నీటిని నేడు కృష్ణా తూర్పు డెల్టాకు విడుదల చేశామని తెలిపారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారే సమర్పించి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. ఏరువాక కార్యక్రమం తరువాత నీటి విడుదల అనేది రైతులకు ఆనందించదగ్గ రోజని కలెక్టర్ వెల్లడించారు.


ఏపీలో ఇప్పటికే రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను అందించిందని ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. జులై 1న నీటి విడుదల ఉంటుందని చెప్పారని... చెప్పినట్టే నేడు మంత్రి నిమ్మల రామానాయుడు మార్గదర్శకత్వంలో కలెక్టర్ నీటిని విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్‌నినోపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని.. ఆ కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని గోపాలకృష్ణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత

దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 12:16 PM