‘నారీ శక్తి వందన్’కు మద్దతివ్వండి.. పార్టీల అధ్యక్షులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:18 PM
మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశారు.
అమరావతి, ఏప్రిల్ 14: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు తదితర నాయకులకు ముఖ్యమంత్రి లేఖలు పంపారు.
మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న
దయచేసి మాలాంటోళ్లను ఆదుకోండి సర్.. దివ్యాంగుడి ఆవేదన
Read Latest AP News And Telugu News