గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రియాక్షన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:50 PM
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అమరావతి, జూన్ 16: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏపీ హోంమంత్రి అనిత గురించి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని.. కానీ మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఒక మహిళా మంత్రిని ‘మేకప్ మంత్రి’ అని సంబోధించడం ఆమెను మాత్రమే కాదు, మహిళలందరినీ అవమానించినట్టే అని మండిపడ్డారు.
వ్యక్తిగత దూషణలు సరికాదు..
మహిళల రూపం, దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం రాజకీయ విమర్శ కాదని... అది మహిళల గౌరవాన్ని కించపరచడమే అని శైలజ వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఆమె రూపాన్ని బట్టి కాదని, ఆమె పనితీరు, సామర్థ్యాన్ని బట్టి అంచనా వేయాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత బాధాకరమన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే విధానాలపై చర్చించాలి గానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు.
ఈ వ్యాఖ్యలను సమాజం అంగీకరించదు..
మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత విచారకరమని రాయపాటి శైలజ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న ఈ సమయంలో వారిని నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయంగా ఎవరూ ఎదగలేరన్నారు. నైతిక విలువలు, సంస్కారం లేనివారు ఎప్పటికీ నిజమైన నాయకులు కాలేరని అన్నారు. మహిళల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆ బాధ్యత మరింత ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలను మహిళా సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఈ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గుడివాడ అమర్నాథ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
మహిళా కమిషన్ సీరియస్..
హోమ్ మంత్రి అనితను కించపరిచే విధంగా మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. అమర్నాథ్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కమిషన్ లేఖ పంపనుంది. అదేవిధంగా.. గుడివాడ అమరనాథ్కు సమన్లు ఇవ్వాలని మహిళా కమిషన్ నిర్ణయించింది. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే గాకుండా సమర్థించుకునే విధంగా మాట్లాడుతున్నారని మహిళ కమిషన్కు పలువురు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఊరిలో లేకపోవడంతో రేపు(బుధవారం) సమన్లు పంపాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
టీజీ బిల్డర్స్ అసోసియేషన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ
ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News