Share News

సోషల్ మీడియాలో జెన్‌ జీ క్రియాశీలకం..అందుకు తగ్గట్టుగా సిద్ధమవ్వాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఎల్‌నినోపైనే కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.

సోషల్ మీడియాలో జెన్‌ జీ క్రియాశీలకం..అందుకు తగ్గట్టుగా సిద్ధమవ్వాలి: సీఎం చంద్రబాబు
AP Cabinet meeting

అమరావతి, సెప్టెంబర్ 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఎల్‌నినోపైనే కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. మైనస్ 52 శాతంలో వర్షాలు నమోదయ్యాయని.. తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని, సీడ్ బాల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. పశుగ్రాసంపై దృష్టి పెట్టాలని కోరింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది.


వెలిగొండ, పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వడంపై ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. సీఎం కేబినెట్‌లోకి రాగానే అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజినీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రులందరూ ప్రజలలోకి వెళ్లాలని చెప్పారు. ‘మనం ఇన్ని పనులు చేస్తున్నాం.. వీటన్నింటినీ ప్రజలకు చెప్పుకోవాలి. కొత్త జనరేషన్ జెన్ జీ అన్ని విషయాలపై అవగాహనతో ఉంది. వాళ్లు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు. మనం కూడా అందుకు తగినట్టుగా సిద్ధమవ్వాలి. మనం చేస్తున్న మంచిని జెన్ జీ వద్దకు తీసుకువెళ్లాలి’ అని సూచించారు.


వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులతో చంద్రబాబు అన్నారు. తప్పుడు, ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ ముందు ఉంటుందని విమర్శించారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదలపై కూడా వైసీపీ సిగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ పూర్తైనా అది కూటమి ప్రభుత్వం చేసిందే అని.. ఈ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కూడా అదుపు చేయాలన్నారు. దీనిపై ఉన్న కేబినెట్ సబ్ కమిటీ ధరలపై జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనించాలని అన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ధరల పెరుగుదలపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు కోరారు.


ఇవి కూడా చదవండి...

క్రెడిట్ చోరీ వ్యాధికి మొదటి రోగి జగన్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 05:01 PM