Share News

కుట్రలు, అసత్య ప్రచారం.. గొడ్డలి పార్టీ డీఎన్ఏలోనే ఉంది: అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:20 PM

నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

కుట్రలు, అసత్య ప్రచారం.. గొడ్డలి పార్టీ డీఎన్ఏలోనే ఉంది: అనగాని సత్యప్రసాద్
Anagani Satya Prasad

అమరావతి, జూన్ 1: నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని... నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు.. విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ నేతలే తీయించడం.. మళ్లీ ధర్నాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యబట్టారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ వ్యాఖ్యానించారు.


వైఎస్ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు పెట్టి రాజకీయం చేశారని.. ఇప్పుడు అదే విగ్రహాలను విధ్వంసం చేసి రాజకీయం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గతంలోనూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టే ప్రయత్నం చేశారన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం విషయంలో కుట్రలు బయటపడ్డాయి కాబట్టి... సాక్షిలో పెద్దగా కవరేజ్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తుంటే.. డీఎస్సీలో తప్పిదాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి వ్యవహరాలు బయటపడుతుండడంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏడాది క్రితం జరిగిన డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు పన్నడం, అసత్య ప్రచారం చేయడం గొడ్డలి పార్టీ డీఎన్ఏలోనే ఉందంటూ వ్యాఖ్యానించారు.


జెన్-జీ, జెన్-అల్ఫా భవితకు అవసరమైన అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని అనగాని తెలిపారు. ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని... ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని.. దీన్ని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రం అగ్రస్థానంలోకి వెళ్తున్నప్పుడు... అనిశ్చితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ స్కాం.. లిక్కర్ స్కాంలు బయటకొస్తుంటే గొడ్డలి పార్టీలో వణుకు పుడుతోందన్నారు. తానిచ్చే బిర్యానికి కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉండాలనే ఆలోచన గొడ్డలి పార్టీ నాయకుడిదంటూ దుయ్యబట్టారు. ప్రజలు చక్కటి ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని మెరుగైన జీవితాన్ని పొందాలనేది తమ నాయకుడి ఆలోచన అని తెలిపారు. ఓ డీఎస్సీని అద్భుతంగా నిర్వహించి.. మళ్లీ ఇంకో డీఎస్సీని నిర్వహించుకునేందుకు సిద్ధమవుతుంటే.. కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. యువకులు నిర్వీర్యమైపోవాలనేది గొడ్డలి పార్టీ ఆలోచన అని.. యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది కూటమి సంకల్పమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 05:07 PM