Share News

విషాదం.. మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:19 AM

ఏడడుగులు వేసిన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతుల బంధం.. చివరకు మరణంలోనూ విడిపోలేదు. భర్త మృతిని చూసి తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన దువ్వూరులో చోటుచేసుకుంది.

విషాదం.. మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
Kadapa Latest News

కడప, ఆగస్టు 10: జిల్లాలోని దువ్వూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి మృతి చెందారు. భర్త మృతదేహాన్ని చూసిన భార్య నారాయణమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. భర్తను కోల్పోయిన బాధను తట్టుకోలేక అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయిన ఆమె.. అలాగే ప్రాణాలు వదిలారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా నిలిచిన ఈ భార్యాభర్తలు చివరకు మరణంలోనూ విడిపోకుండా కన్నుమూయడం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. భర్త మృతిని చూసిన కొద్దిసేపటికే భార్య కూడా మృతి చెందడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో దువ్వూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.


దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకరి మృతితో తీవ్ర మనోవేదనకు గురైన మరొకరు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల అనుబంధానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..

ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!

Updated Date - Aug 10 , 2026 | 01:21 PM