నన్ను చంపాలనుకున్నారు
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:25 AM
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, చంపుతామని బెదిరించారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఆయన కోడలు మేఘన ఫిర్యాదు చేశారు. లోక్భవన్లో బుధవారం గవర్నర్ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు.
గోవా, ఘట్కేసర్, జోగి రమేశ్ నివాసంలో పలుమార్లు హత్యా యత్నం
గవర్నర్కు జోగి రమేశ్ కోడలు మేఘన ఫిర్యాదు
విజయవాడ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, చంపుతామని బెదిరించారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఆయన కోడలు మేఘన ఫిర్యాదు చేశారు. లోక్భవన్లో బుధవారం గవర్నర్ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. జోగి రాజీవ్తో వివాహం జరిగిన నాటినుంచీ తనను జోగి రమేశ్ కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. శారీరకంగా హింసించారని, మానసిక వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. ‘‘పెళ్లి సమయంలో 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, రూ.9 లక్షల ఆడపడుచు కట్నం ఇచ్చాం. పెళ్లికి రూ.5 కోట్లు ఖర్చు చేశాం. పెళ్లయిన కొద్దిరోజులకే అదనంగా రూ.5 కోట్ల నగదు, ఫార్చూనర్ కారు, వజ్రాభరణాల కోసం వేధించడం మొదలెట్టారు. నమ్మకంగా గోవా తీసుకెళ్లి.. పడవలో నుంచి తోసేందుకు ప్రయత్నించారు. ఘట్కేసర్ ఫాంహౌస్లో దిండుతో ఊపిరిఆడకుండా చేసి చంపేందుకు యత్నించారు. ఇబ్రహీంపట్నంలోని నివాసం టెర్ర్సపై నుంచి కిందకు తోసేయబోయారు. చున్నీతో ఊపిరి ఆడకుండా చేసి తీవ్రంగాకొట్టారు. నాకు, నా తల్లిదండ్రులకు జోగి కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. నాకు వ్యక్తిగత భద్రత కల్పించండి’’ అని మేఘన కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న కొన్ని వీడియో ఆధారాలను అందజేశారు. ఆమె వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు