ఉద్యోగులకు డీఏ బొనాంజా!
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:25 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కరువు భత్యాల(డీఏ)ను చెల్లించేందుకు వీలుగా జీవోలు జారీ చేసింది. బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కరువు ఉపశమనం(డీఆర్) విడుదల చేయనున్నారు.
2 డీఏల చెల్లింపునకు ఉత్తర్వులు
2.73, 1.82 శాతం చొప్పున పెంపు
పెన్షనర్లకు 2 డీఆర్లు కూడాసెప్టెంబరు జీతం, పెన్షన్తో కలిపి అక్టోబరులో చెల్లింపులకు ఆదేశం
బకాయిలు 4 విడతల్లో ఖాతాల్లోకి
4 జీవోలు జారీ చేసిన ప్రభుత్వం
డీఏ వీరికి కూడా..
జిల్లా, మండల పరిషత్లు, గ్రామపంచాయతీల ఉద్యోగులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సిబ్బంది, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. అలానే, 2022లో సవరించిన పేస్కేళ్ల ప్రకారం వేతనం పొందుతున్న వర్క్చార్జ్డ్ సిబ్బందికి, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సిబ్బందికి డీఏ రానుంది. ఇక, యూజీసీ-2006 పేస్కేళ్ల ప్రకారం వేతనం పొందుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీకాలేజీలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ బోధనా సిబ్బందికి, 2016 యూజీసీ పేస్కేళ్లు పొందుతున్న వారికి ఈ డీఏ పెంపు వర్తించనుంది.
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కరువు భత్యాల(డీఏ)ను చెల్లించేందుకు వీలుగా జీవోలు జారీ చేసింది. బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కరువు ఉపశమనం(డీఆర్) విడుదల చేయనున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆర్థిక శాఖ శుక్రవారం 4 జీవోలు జారీ చేసింది. ఉద్యోగులకు 2 డీఏలు, పెన్షనర్లకు 2 డీఆర్ల చెల్లింపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
37.31 నుంచి 40.04 శాతానికి పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం, 1.82 శాతం మేరకు డీఏలను పెంచారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల బేసిక్ పే(మూల వేతనం)పై ప్రస్తుతం ఉన్న డీఏ 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెరుగుతుంది. రెండో డీఏ 41.86 శాతానికి పెరగనుంది. పెంచిన కరువుభత్యాలు 2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటిని ఈ నెల జీతంతో కలిపి అక్టోబరులో చెల్లిస్తారు. ఈ డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిల్లో 10 శాతాన్ని తొలివిడతగా 2027 ఏప్రిల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు
ఈ 10 శాతాన్ని జీపీఎఫ్లో జమ చేస్తారు. సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు 10 శాతం బకాయిల మొత్తాన్ని దానికి సమానమైన ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను మూడు సమాన విడతల్లో 2027.. జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో జమ చేయనున్నారు. రెండో డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిల్లో 10 శాతం మొత్తాన్ని తొలి విడతగా 2028 జనవరిలో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్లో, సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కూడా కలిపి ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 3 సమాన విడతల్లో 2028.. మార్చి, మే, జూలై నెలల్లో చెల్లిస్తారు.
2 డీఆర్లు కూడా..
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు 2.73 శాతం, 1.82 శాతం డీఆర్లు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024, జూలై 1, 2025, జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. బేసిక్ పెన్షన్పై డీఆర్ 37.31 శాతం నుంచి 40.04 శాతానికి, రెండో డీఆర్ 41.86 శాతానికి పెరుగుతుంది. అన్ని వర్గాల ప్రభుత్వ పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది.
పెంచిన కరువు ఉపశమనం ఈ నెల పెన్షన్తో కలిపి అక్టోబరులో నగదు రూపంలో చెల్లిస్తారు. 26 నెలల బకాయిల్లో 10 శాతాన్ని తొలివిడతగా 2027 ఏప్రిల్లో, మిగిలిన 90 శాతం బకాయిలను 3 సమాన విడతల్లో 2027.. జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో చెల్లిస్తారు.
పెంచిన రెండో కరువు ఉపశమనం ఈ నెల పెన్షన్తో కలిపి అక్టోబరులో ఇస్తారు. 20 నెలల బకాయిల్లో 10 శాతాన్ని తొలివిడతగా 2028.. జనవరిలో చెల్లిస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 3 సమాన విడతల్లో 2028.. మార్చి, మే, జూలై నెలల్లో చెల్లించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఏపీలో కేంద్రమంత్రి నడ్డా పర్యటన.. 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం