టీడీపీకి గల్లీ పాలిటిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:30 PM
తెలుగుదేశం పార్టీకి గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసునని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ఎజెండగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 29: తెలుగుదేశం పార్టీకి గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసునని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ఎజెండగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. తెలుగువారికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.
తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే టీడీపీ బలం అని అభివర్ణించారు. తనకు ఇచ్చిన పదవితో బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఒక్కడినే చేస్తాననే అహంకారం తనకు లేదని.. అందరం కలిసి పని చేద్దామని కేడర్కు పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి లోకేశ్ వివరించారు. కార్యకర్తల కష్టం వల్లే మనమంతా ఇక్కడ ఉన్నామని స్పష్టం చేశారు.
యువగళం పాద యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడామన్నారు. ఓడినప్పుడు వెనక్కి తగ్గలేదు.. అలాగని గెలిచామని కాలర్ ఎగురవేయలేదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో నరకం అనుభవించాం.. ఎన్నో కష్టాలు పడ్డామని నాటి విషయాలను ఈ సందర్భంగా లోకేశ్ ప్రస్తావించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పారు.
కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ వివరించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు సృష్టించామని లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రసంగంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎప్పుడూ నవ్వుతూ పనిచేసే వ్యక్తి పల్లా శ్రీనివాస్ అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకంటే ఎక్కువ మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గెలిచారని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఘనత పల్లా శ్రీనివాసరావుదేనని ఈ సందర్భంగా లోకేశ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News