రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన మంత్రి లోకేశ్, ఏన్డీయే ఎంపీలు..
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:20 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫునా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులు, ఏపీ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఇంటెలిజెంట్, విజనరీ లీడర్ అంటూ మెచ్చుకున్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం నిజంగా హర్షణీయమన్నారు ద్రౌపది ముర్ము. అందుకు కృషి చేసిన చంద్రబాబు గ్రేట్ అన్నారు. కాగా, రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఆమెతో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు.
జగన్ మాటలు విడ్డూరం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలపడంపై రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుని రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన గురించి అందరూ మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయంలో దేశమంతా ఒకవైపు ఉంటే వైసీపీ మాత్రం మరోవైపు ఉందన్నారు అప్పలనాయుడు. ఆ పార్టీ నేతలు మాత్రమే అమరావతిలో అవినీతి జరుగుతోందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఫ్యాన్ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల త్యాగాలకు అనుగుణంగా రాజధాని బిల్లుకు ఆమోదం లభించిందని.. వైసీపీ నేతలు ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తున్నారని ఆగ్రహించారు. మావిగన్ పేరుతో ప్రజలను జగన్ మోహన్ రెడ్డి మభ్యపెడుతున్నారని ఎంపీ అప్పలనాయుడు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్, సజ్జల ప్రజల జీవితాలతో చెలగాటమాడారు: హనుమంతరావు
జగన్వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు