Share News

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:57 PM

రాజ్యసభ సభ్యుడు అనేది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ స్పష్టం చేశారు.

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్
Lingamaneni Ramesh

అమరావతి, జూన్05: రాజ్యసభ సభ్యుడు అనేది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆయన స్పందించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో లింగమనేని రమేశ్ మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి తరఫున తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.


జనసేన పార్టీ పక్షాన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. తనకు పదవి కాకుండా బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నానని లింగమనేని రమేశ్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే తన లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. ఆయా స్థానాలు కూటమిలోని పార్టీలకే చెందుతాయి. మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించాలని గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ఎంపిక చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అలాగే టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. వారు ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలనుందనే చర్చ కూటమిలో కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

For More AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 09:15 PM