అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
ABN , Publish Date - Jun 05 , 2026 | 08:00 PM
అమరావతిలో ప్రస్తుతం వేలాది మంది కార్మికులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అమరావతి: అమరావతి అభివృద్ధిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాజధాని కోసం ఒక్క నిర్మాణ పనీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతిలో వేలాది మంది కార్మికులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు.
అమరావతి అభివృద్ధితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా జగన్ విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్గా మారుతుందని చెప్పారు. అమరావతిలో బిట్స్ పిలాని, ఎస్ఆర్ఎం, వీఐటీ వంటి విద్యాసంస్థలు ఏర్పడటం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అంశాలపై కూడా గత ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించలేదని విమర్శించారు.
29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చి రాజధానికి సహకరించారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణాలు వచ్చే రెండేళ్లలో మరింత వేగంగా పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు చేయడం తగదని జగన్ను విమర్శించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ కేశినేని శివనాథ్పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్
ఏపీలో పలువురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ