మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Jul 23 , 2026 | 07:01 PM
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కుమారుడు ఆరవ్ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఇటీవల సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుమారుడికి బదులుగా సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారని, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టడంతో పాటు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను మార్చి కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజును కోర్టులో హాజరుపరచగా, పలాస కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read:
నాపై ఆరోపణలు నిరాధారం: నటి జత్వానీ
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’