డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశం..
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:32 PM
ఏపీలో డీజిల్ కొరత సమస్యను పరిష్కరించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రంలో డీజిల్ కొరతతో బంకులు మూసివేయడంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సంబంధిత అధికారులతో ఇవాళ(ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజిల్ సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,510 బంకులు ఉన్నాయని.. వాటిల్లో 421 బంకులకు సరఫరా లేక మూతపడినట్లు వెల్లడించారు. మరోవైపు వినియోగదారులు ప్యానిక్ కొనుగోళ్లకు పాల్పడుతున్నట్లు వివరించారు. దీంతో డిమాండ్ పెరిగిందన్నారు. అధికారులు నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్ సమస్యతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు.
అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా కొన్ని రోజులపాటు గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడగా.. తాజాగా డీజిల్ దొరక్క సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరత కారణంగా వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట చేతికి వస్తున్న తరుణంలో కోత మిషన్లకు కనీసం లీటర్ డీజిల్ కూడా దొరకడం లేదని తెలుస్తోంది. మరోవైపు డీజిల్ వాహనదారులూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం
విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి తీవ్రగాయాలు..