సీఎం చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Jul 11 , 2026 | 08:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13న వరుసగా మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13న వరుసగా మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేటు పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలను స్వయంగా తెలుసుకోనున్నారు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 13న ఉదయం 10:25 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు తూర్పు గోదావరి జిల్లా వేమగిరి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:10 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11:25 గంటలకు బ్యారేజ్ నంబర్-1 గేటు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత 11:50 గంటలకు ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రైతులతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 12:55 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి వేమగిరి హెలిప్యాడ్కు చేరుకుంటారు. హెలికాప్టర్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్