Share News

ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై రాళ్లదాడి.. సుప్రీంకోర్టులో విచారణ

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:46 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2022లో నందిగామలో ఆయన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి సాధారణమైనది కాదని, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై రాళ్లదాడి.. సుప్రీంకోర్టులో విచారణ

  • నందిగామలో నాడు భద్రతా సిబ్బందికీ తీవ్ర గాయాలు

  • నిందితులను కస్టడీకి ఇవ్వండి

  • సీనియర్‌ న్యాయవాది లూథ్రా అభ్యర్థన.. సుప్రీం నిరాకరణ

  • దర్యాప్తునకు సహకరించాలని నిందితులకు ఆదేశం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2022లో నందిగామలో ఆయన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి సాధారణమైనది కాదని, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న భద్రతా సిబ్బందికి సైతం తీవ్ర గాయాలయ్యాయని.. కేసులో లోతైన దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు, వెనుక ఉన్న శక్తులు వెలుగులోకి వస్తాయని తెలిపారు. బాధితులకు న్యాయం జరగాలన్నా, దర్యాప్తు పారదర్శకంగా సాగాలన్నా నిందితులను కస్టడీలోకి తీసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు.


నందిగామలో చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి అక్కడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నిందితులైన కన్నెగంటి సజ్జనరావు, మరొకరు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ ప్రసన్న బి. వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లూథ్రా వాదనలు వినిపించారు.


నిందితులపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని.. చంద్రబాబు కాన్వాయ్‌పై వారు ఉద్దేశపూర్వకంగానే రాళ్లు రువ్వారని.. ఈ కుట్రలో మరిన్ని నిజాలు వెలుగులోకి రావలసిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో వారిని కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ దవే వాదనలు వినిపించారు. కేసులో ఇప్పటివరకు ఐదుగురు దర్యాప్తు అధికారులను మార్చినా కేసు ముందుకు సాగలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి, చంద్రబాబే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కొందరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.


నిందితులు దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవలసిన అవసరం లేదని స్పష్టంచేసిది. అయితే దర్యాప్తునకు వారు సహకరించాలని ఆదేశించింది. బెయిల్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే బాధ్యతను కింది కోర్టుకే అప్పగిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.

Updated Date - Aug 12 , 2026 | 07:51 AM