నేతన్న సేవలో పథకం అర్హులకు మంత్రి సవిత కీలక సూచన..
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:27 PM
ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలు, కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. 'నేతన్న సేవలో' పథకం అమలు, కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. 'నేతన్న సేవలో' పథకానికి అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గడువులోపు చేనేత కార్మికులందరూ దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని అందుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థికసాయాన్ని చేనేత కార్మికులకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా 'నేతన్న సేవలో' పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల గౌరవప్రదమైన జీవనమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఈ సందర్భంగా సవిత చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ పథకం అమలులో ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా పని చేయాలని అధికారులకు మంత్రి సవిత సూచించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా గడువు పొడిగింపు
జగన్ సిగ్గు లేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం