షైనింగ్ స్టార్స్ను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Jun 29 , 2026 | 07:22 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను ఘనంగా సన్మానించారు.
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులే విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో ఆయన పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పదో తరగతి 55 మంది షైనింగ్ స్టార్స్కు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన 61 మంది షైనింగ్ స్టార్స్కు ల్యాప్టాప్లు, మెడల్స్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం గురించి చర్చ జరిగేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖలో పలు సంస్కరణలు చేపట్టామని, వాటి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎవరూ ముందుకు రాకపోయినా, ఇప్పుడు సీట్ల కోసం సిఫార్సులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో రాజకీయాలకు చోటు ఉండకూడదని నిర్ణయించామని, పాఠశాలల్లో రాజకీయ ప్రచారానికి అవకాశం ఇవ్వబోమని చెప్పారు. వ్యక్తిగత రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, 2019లో మంగళగిరి నియోజకవర్గంలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, తొలి రోజు బాధ కలిగినా ఆ తర్వాత అదే తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు. విద్యా రంగంలో మార్పు తీసుకురావడానికి రెండేళ్లు కష్టపడ్డానని, ఇప్పుడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు.
Also Read:
31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..