‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఏపీకి లభించడం గర్వకారణం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Jun 03 , 2026 | 03:42 PM
ఆంధ్రప్రదేశ్కు ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ పురస్కారం దక్కడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ అవార్డు రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో సేవలందిస్తున్న అందరి సమిష్టి కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపని ఆయన పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం (APCNF)కు దక్కింది.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ రాష్ట్రానికి లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా అమలవుతోందన్నారు. రైతులు, గ్రామీణ మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు, RySS సంస్థ, శాస్త్రవేత్తల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో లభించిన ఈ పురస్కారాన్ని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు అంకితం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన ఈ నమూనాను దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. సుస్థిర వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు రైతాంగ అభివృద్ధికి కొత్త అవకాశాలు తీసుకురావడంతో పాటు ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:
విషప్రచారాలు కట్టడి చేస్తాం.. ప్రతీది బహిర్గతం చేసేందుకు సిద్ధం: హోం మంత్రి అనిత
ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..
For More Latest News