పెట్రోల్, డీజిల్ కొరతకు చెక్..
ABN , Publish Date - Apr 28 , 2026 | 08:29 PM
ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. సరఫరా మెరుగుపడటంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ భారీగా తగ్గిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమస్యను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.
ఇంధన సరఫరాను వేగవంతం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వినియోగదారులకు 5,373 కిలోలీటర్ల పెట్రోల్, 8,777 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదే రోజు స్టాక్ పాయింట్ల నుంచి పెట్రోల్ బంకులకు 10,402 కిలోలీటర్ల పెట్రోల్, 17,805 కిలోలీటర్ల డీజిల్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకూ ఏపీలోని 100 శాతం బంకుల్లో పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మెరుగుపడటంతో అధికారులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీకి వచ్చే ప్రతి పరిశ్రమకూ అండగా ఉంటాం: మంత్రి లోకేశ్..
ఉత్తరాంధ్రలో రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి: మంత్రి నిమ్మల