పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:12 PM
'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కాకినాడ జిల్లా: 'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తునిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వరుస విజయాలు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే రైతులకు ఉచిత వ్యవసాయ పంపుసెట్లు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, క్లస్టర్ స్థాయి సమావేశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని భారీగా పెంచాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం తమ నైతిక బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.
జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అనంతరం జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణ హితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో సాధించిన 55.5 శాతం ఓట్ల కంటే మరింత ఎక్కువ ప్రజా మద్దతు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన డిక్షనరీలో ఓటమి అనే మాట ఉండకూడదని.. ప్రతి కార్యకర్త ఏకపక్షంగా గెలుపు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం
తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు
For More AP News