డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. పట్టుబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్..
ABN , Publish Date - Sep 05 , 2026 | 07:40 AM
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయవాడ నుంచి జగదల్పూర్కు సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న గుప్తా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ, సెప్టెంబర్ 5: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. విజయవాడ నుంచి జగదల్పూర్కు సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న గుప్తా ట్రావెల్స్ బస్సును పోలీసులు తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికులంతా బస్సులో ఉండగానే డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చిన్న పొరపాటు జరిగినా బస్సులో ఉన్న 35 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇటీవల ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లో ప్రయాణించే బస్సు డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అనే అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే బస్సులకు డ్రైవర్ అప్రమత్తత అత్యంత కీలకమని.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా డ్రైవర్ల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆటో మీటర్.. తొలి 1.6 కి.మీ.కు రూ.30
For More TG News And Telugu News