కూటమి పాలనలో ప్రజలకు భరోసా: నాదెండ్ల
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:18 AM
‘ఐదేళ్ల వైసీపీ పాలనలో భయంతో జీవించిన ప్రజలకు భద్రత, భరోసా కల్పించే విధంగా గడచిన రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన సాగింది’ అని మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో భయంతో జీవించిన ప్రజలకు భద్రత, భరోసా కల్పించే విధంగా గడచిన రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన సాగింది’ అని మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ కార్యక్రమంలో సీఎంతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో కుదేలైన అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతూ వస్తుంది.
జగన్ పాలనలో విశాఖలో భూకబ్జాలు, దందాలపై ప్రజల బాధలు తెలుసుకునేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను మూడు రోజుల పాటు నోవాటెల్ హోటల్లో నిర్బంధించిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి రాజకీయ సమీకరణల్లో మార్పులు వచ్చాయి. తెలుగుదేశంతో కలసి పనిచేయడం మొదలైంది. ఆ ప్రయాణంతో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విశాఖలో దశాబ్దాలుగా పేదలు నివాసం ఉంటున్న ఇళ్లపై సర్వహక్కులు కల్పించడం ద్వారా వారి జీవితాలకు భరోసా వచ్చింది’ అని మనోహర్ అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు