Share News

జనం మెచ్చాలి! ప్రజా సంతృప్తే మనకు కొలమానం

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:29 AM

‘ఎవరికీ ఇగోలు వద్దు. ఏ విషయాల్లో వెనుకబడ్డారో, ఎక్కడ తప్పులు జరిగాయో నిజాయితీగా అంగీకరిద్దాం. తప్పులను సరిదిద్దుకుందాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

జనం మెచ్చాలి! ప్రజా సంతృప్తే మనకు కొలమానం
Chandrababu Naidu

  • ఎవరూ ఇగోలకు పోవద్దు.. మంత్రులు,

  • కలెక్టర్లు, అధికారులంతా ప్రజా సేవకులే

  • తప్పులు చేస్తే ఒప్పుకొని సరిదిద్దుకుందాం

  • ఆఫీసుల్లో కూర్చుంటే ఏమీ తెలియదు

  • కలెక్టర్లు ప్రజల వద్దకు వెళ్లాల్సిందే

  • ఫైలు పెండింగ్‌లో పెట్టడమంటే

  • అభివృద్ధిని పెండింగ్‌లో పెట్టినట్లే

  • ఫిర్యాదు పెండింగ్‌లో ఉంటే

  • ప్రజలకు న్యాయం పెండింగ్‌లో పెట్టినట్లే

  • పీజీఆర్‌ఎస్‌ మొక్కుబడి తంతు కాదు

  • ప్రజలను మీ చుట్టూ తిప్పుకోవద్దు

  • ఫేక్‌ ప్రచారాలను ఖండించండి: సీఎం

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘ఎవరికీ ఇగోలు వద్దు. ఏ విషయాల్లో వెనుకబడ్డారో, ఎక్కడ తప్పులు జరిగాయో నిజాయితీగా అంగీకరిద్దాం. తప్పులను సరిదిద్దుకుందాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తనతోపాటు మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు.. అందరం ప్రజాసేవకులమేనని, అనవసర ఇగోలకు పోవద్దని హితవు పలికారు. గురువారం సచివాలయంలో జరిగిన 8వ విడత జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలు, కలెక్టర్ల పనితీరు, ప్రజా సంతృప్తి స్థాయి వంటి కీలకాంశాలను ప్రస్తావించారు.


ప్రజలతో వారు వ్యవహరించే విధానం ఎలా ఉండాలో పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. రోజంతా ఆఫీసులు, సమీక్షల్లో కూర్చుంటే ఏమీ తెలియదని.. ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయని తేల్చిచెప్పారు. ప్రజల సంతృప్తే తమకు కొలమానమని.. ఇందులో ఎలాంటి సందేహమూ పెట్టుకోవద్దన్నారు. ‘కలెక్టర్‌గా ఒక ఫైలును పెండింగ్‌ పెట్టడం అంటే.. మీరు అందుకు సంబంధించిన అభివృద్ధిని పెండింగ్‌ పెట్టినట్లే. ప్రజల నుంచి వచ్చిన ఒక ఫిర్యాదును పెండింగ్‌ పెట్టారంటే ప్రజలకు దక్కాల్సిన న్యాయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లే’ అని అన్నారు. సదస్సులో జరిగే చర్చలన్నీ ఫలితాలివ్వాలని ఆకాంక్షించారు. ‘లక్ష్యాలు ఎంతవరకు సాధించాం.. సవాళ్లు ఏమిటి? కొత్త సమస్యలు ఎలా వస్తున్నాయి.. వాటి పరిష్కారం ఎలాగో చర్చించుకుందాం. ఇక్కడ నిజాలే మాట్లాడుకుందాం’ అని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


ప్రజాసానుకూల ప్రభుత్వమిది..

మాది ప్రజాసానుకూల ప్రభుత్వం. ప్రభుత్వానికి సానుకూల ప్రజాభిప్రాయం ముఖ్యం. ఇదే పనితీరుకు కొలమానం. దీనిని అధికారులు తప్పనిసరిగా గుర్తించాలి. ప్రజా ప్రభుత్వంలో ఫిర్యాదులు వచ్చాయంటేనే పాలనలో ఎక్కడో లోపాలున్నట్లు లెక్క. మీ యంత్రాంగం జిల్లాలో ఎలా పనిచేస్తున్నారో అన్నీ పరిశీలిస్తున్నాను. ప్రతి మూడు నెలలకోసారి మీ జాతకాలు, నా జాతకాలు చూస్తున్నాను. కలెక్టర్లకు చేసే పనిపై, ప్రజలపై విశ్వాసం ఉండాలి. ఆఫీసుల్లో రోజంతా కూర్చుంటే సమయం అయిపోతుంది. ప్రజల్లోకి వెళ్లాలి. లేదంటే వాస్తవాలు తెలియవు. నాకు ఎన్ని పనులున్నా విధిగా క్షేత్ర స్థాయికి వెళ్తున్నాను. కలెక్టర్లు కూడా వెళ్లాలి.


వారు ఎంత బాగా పనిచేస్తే జనానికి అంత మేలు జరుగుతుంది. వారికీ అంత మంచిపేరు వస్తుంది. మీ కెరీర్‌లో కలెక్టర్‌గా పనిచేసినప్పుడు మీరు చేసే పనులు ప్రజల్లో నిలబడాలి. మీ జ్ఞాపకాల్లో మీరు చేసిన మంచి కనబడాలి. అలాకాకుండా కలెక్టర్‌ గా మీ సమయాన్ని వృథా చేస్తే లాభంలేదు. ప్రజలకూ ఉపయోగపడదు. ప్రభుత్వం సీరియ్‌సగా చేపట్టిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా ఫిర్యాదుల పరిష్కారం)ను మొక్కుబడి తంతుగా మార్చవద్దు. ప్రజా సమస్యల పరిష్కారంలో, పనితీరులో కలెక్టర్లకు తప్పనిసరిగా జవాబుదారీతనం ఉండాలి. అధికారులు, కలెక్టర్లు, మంత్రులు ప్రజలను తమ చుట్టూ తిప్పుకోవడానికి వీల్లేదు.


మహిళా అధికారులు బాగా కౌంటర్‌ ఇచ్చారు..

ఫేక్‌న్యూ్‌సలు, ప్రచారాలు, తప్పుడు ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారానికి ఆధారాలను ముందుపెట్టి కౌంటర్‌ ఇవ్వండి. ప్రభుత్వ చర్యలపై రాజకీయాలు చేసినప్పుడు అధికారులు సమర్థంగా సమాధానమివ్వాలి. డీఎస్సీపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేసింది. ఇద్దరు మహిళా అధికారులు సమర్థంగా కౌంటర్‌ ఇచ్చారు. వారిని అభినందిస్తున్నాను. మీరు తప్పుచేయలేదు.. తప్పులు చేయాలని మేం చెప్పలేదు. మీకే అన్నింట్లో అధికారం ఇచ్చాం. మేం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం క్రీడల కోటాలో 3 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాం. అది అమలు చేసింది మీరే. పరీక్షలు పెట్టి మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. అయినా ప్రభుత్వంపై బురదజల్లితే.. అది తప్పని చెప్పకపోతే శిక్ష మనకే పడుతుంది.


కోనసీమ వెనుకబడింది..

అభివృద్ధి, ఆదాయంలో కోనసీమ ప్రాంతం వెనుకబడింది. నంప్రదాయ వ్యవసాయ విధానాన్నే నమ్ముకున్న రైతులు కొత్తగా వచ్చిన మార్పులను అందిపుచ్చుకోలేకపోతున్నారు. అయితే కరువు ప్రాంతమైన అనంతపురం అభివృద్ధిలో ముందుకొచ్చింది. అమరావతిని రాబోయే రోజుల్లో హైద రాబాద్‌కు ఇప్రూవ్డ్‌ వెర్షన్‌గా తీసుకొస్తాం. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వచ్చిన తర్వాత విజయవాడ-గుంటూరు-అమరావతి నడుమ కనెక్టివిటీ పెరిగింది. ఇది ఆరంభం మాత్రమే. రాయలసీమ రైజింగ్‌, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు, వెలిగొండ జలధార అభివృద్ధికి రెక్కలు, కోస్తా భవిష్యత్‌ కొత్తపుంతలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.


నేనొక్కడినో, మంత్రులో పనిచేస్తే కాదు.. చివరి స్థాయిలో అధికారి వరకు పనిచేస్తేనే ఫలితాలు వ స్తాయి. ఇది మన కు లిట్మస్‌ టెస్ట్‌ లాంటిది.

ప్రభుత్వం అంటే గుడ్డిగా పనిచేయడం కాదు. ప్రతి అధికారికీ సొంత ఆలోచన, లక్ష్యాలు ఉండాలి.

ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలకు.. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న అధికారులు, మంత్రులు సమాధానం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం పెనాల్టీ చెల్లించాలా?

- సీఎం చంద్రబాబు


ఈ వార్తలు కూడా చదవండి..
సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 03:29 AM