కుప్పంలో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభం
ABN , Publish Date - Jan 31 , 2026 | 06:59 PM
కుప్పంలో యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. రూ.కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
తిరుపతి జిల్లా: కుప్పం పట్టణంలో విద్య, ఉపాధి అవకాశాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో రూ.కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ నవదిశ సెంటర్లో రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లో అన్ని రకాల ఆధునిక సాంకేతిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రం ఏర్పాటు కోసం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) సహకారంతో APTS కార్పొరేషన్ ఆర్థిక సహాయం అందించింది.

ఈ సెంటర్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత, చిన్న వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు, పేద కుటుంబాల యువతకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో కార్యాలయ వాతావరణం కల్పించడం, డిజిటల్ చదువులను ప్రోత్సహించడం, కొత్తగా స్టార్టప్లు ప్రారంభించాలనుకునే యువతకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) సహకారంతో కుప్పం లాంటి ప్రాంతంలో ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి డిజిటల్ వసతులు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో APTS ముందుకు సాగుతోందని తెలిపారు.

యువతకు ఉపయోగపడే ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినందుకు APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని సీఎం పేర్కొన్నారు.
Also Read:
నేను ఇంత పెద్ద వయస్సులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అంబటి రాంబాబు
జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు
For More Latest News