అమరావతిలో కొత్త విద్యాశకం.. వైద్య కళాశాల, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఒప్పందం
ABN , Publish Date - May 07 , 2026 | 05:10 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా రంగంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా రంగంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి వైద్య విద్య, నైపుణ్యాధారిత శిక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీతో ఏపీ సీఆర్డీఏ (APCRDA) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాజధానిలో మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై గురువారం లీజ్ ఒప్పంద ప్రక్రియ అధికారికంగా పూర్తయింది.
ఈ ప్రాజెక్టు కోసం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ పరిధిలో సుమారు 23 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన సీఆర్డీఏ కేటాయించింది. ఈ ఒప్పంద కార్యక్రమం సీఆర్డీఏ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఆర్డీఏ డైరెక్టర్ చిరాన్ రాయ్, ఆదిత్య ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆద్విక్ బొల్లినేని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. అనంతరం ఆదిత్య ఎడ్యుకేషన్ ప్రతినిధులు తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాధారిత ఉన్నత విద్యను అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. విద్యార్థులకు విస్తృతమైన పరిశోధనలకు అవకాశం కల్పిస్తూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ సంస్థలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పలు వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల ఏర్పాటు..
Read Latest Telangana News and National News