16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపితే.. వైసీపీ ఓర్వలేకపోతోంది: మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:17 AM
నెల్లూరులో వైసీపీ చేపట్టిన ఆందోళనలపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైసీపీ నేతలు ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు..
నెల్లూరు, ఆగస్టు 8: మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించి, 16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఎందుకు నిరాహార దీక్షలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు గతంలో వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి విఫలమయ్యారని, ఇప్పుడు 16 వేల మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందడాన్ని కూడా ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని నారాయణ ఆరోపించారు.
మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ను మళ్లీ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనే భయంతోనే వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ఉద్యోగాల కల్పనను అడ్డుకోవడం ద్వారా వైసీపీ ప్రజల ముందు మరింత చులకన అవుతోందని అన్నారు. వైసీపీ తీరును ప్రజలు ఛీత్కరిస్తున్నారని, వారికి తగిన బుద్ధి ప్రజలే చెబుతారని నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News